మాజీ సైనికుల సమక్షంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
దేశభక్తి చాటిన కడిపికొండ సనాతన ధర్మం యువత
హమారా వరంగల్ – కడిపికొండ:
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కడిపికొండ సనాతన ధర్మం యువత ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను ప్రత్యేకంగా ఆహ్వానించి, వారి సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటారు.
ఈ సందర్భంగా దేశం కోసం తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ శాలువాలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక పండుగ కాదని, ఎంతోమంది మహనీయుల త్యాగాలు, సైనికుల సేవల ఫలితంగా మనకు లభించిన అమూల్యమైన స్వేచ్ఛ అని అన్నారు. దేశాన్ని రక్షించే సైనికుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి దేశభక్తి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సనాతన ధర్మం అంటే కేవలం ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే కాదని.. దేశం, ధర్మం, సంస్కృతి, సమాజం పట్ల బాధ్యతతో జీవించడమే నిజమైన ధర్మమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, దేశ ఐక్యతను మరింత బలోపేతం చేయడంలో యువత ముందుండాలని అన్నారు.
దేశం కోసం సేవ చేసిన మాజీ సైనికులను గౌరవించడం ద్వారా “దేశం కోసం త్యాగం చేసిన వారిని మరవం.. దేశభక్తి భావాన్ని తరతరాలకు చాటుతాం” అనే సందేశాన్ని కడిపికొండ సనాతన ధర్మం యువత బలంగా చాటింది.
కార్యక్రమంలో కడిపికొండ సనాతన ధర్మం యువత, మాజీ సైనికులు, స్థానిక యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
