
‘మన హక్కులు.. మన భవిష్యత్’ అంటూ హనుమకొండలో హక్కుల వాక్
యువత హక్కుల కోసం గళమెత్తాలి.. బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: దుగ్గంపూడి రంజిత్ రెడ్డి
హనుమకొండ:
‘మన హక్కులు.. మన భవిష్యత్’ నినాదంతో హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. రైట్ టు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భారీ రైట్స్ వాక్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. ఏకశిల పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీ ఆద్యంతం హక్కుల నినాదాలతో మార్మోగింది.
కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై యువతలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతి పౌరుడికి విద్య, వైద్యం సమానంగా అందినప్పుడే స్వాతంత్య్రానికి నిజమైన అర్థం చేకూరుతుందని అన్నారు. విద్య, వైద్యం, సమానత్వం ప్రతి పౌరుడి హక్కులని, వాటి కోసం యువత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
యువత దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని పేర్కొన్న రంజిత్ రెడ్డి.. చెడు వ్యసనాలు, చెడు మార్గాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని సూచించారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని ఆకాంక్షించారు. యువతలో సామాజిక బాధ్యత, దేశభక్తి, హక్కులపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
200 మీటర్ల జాతీయ జెండాతో దేశభక్తి ప్రదర్శన
ర్యాలీలో పాల్గొన్న యువత ‘విద్య, వైద్యం, సమానత్వం ప్రతి పౌరుడి హక్కు’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. సుమారు 200 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. ఏకశిల పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన రైట్స్ వాక్ హనుమకొండలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం వేడుకగా కాకుండా పౌరుల హక్కులు, బాధ్యతలపై చైతన్యం కలిగించే రోజుగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.







