
అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఘనంగా తిరంగా ర్యాలీ
80 మీటర్ల జాతీయ జెండాతో దేశభక్తి చాటిన 60వ డివిజన్ ప్రజలు
హన్మకొండ, హమారా వరంగల్:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని GWMC 60వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అభినవ్ భాస్కర్ నేతృత్వంలో.. కదిలిన 60వ డివిజన్
వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో 80 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రజలు ఉత్సాహంగా ముందుకు సాగగా, దేశభక్తి నినాదాలతో వడ్డేపల్లి పరిసరాలు మార్మోగాయి. భారీ జాతీయ జెండా ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘జాతీయ జెండా.. ప్రతి భారతీయుడి గర్వం’
ఈ సందర్భంగా డా. దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ.. జాతీయ జెండా కేవలం ఒక పతాకం కాదని, అది భారతదేశ స్వాతంత్ర్యం, గౌరవం, ఐక్యత, సార్వభౌమత్వానికి ప్రతీక అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించేందుకు గత ఐదేళ్లుగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి ముందుకు సాగాలని అభినవ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.
దేశభక్తి నినాదాలతో హోరెత్తిన వడ్డేపల్లి
ర్యాలీలో యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవం చాటారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ డా. దాస్యం అభినవ్ భాస్కర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







